Madhya Pradesh: ప్రియుడితో కలిసి భర్తను చంపిన మూడో భార్య..
ఎలా దొరికేసింది అంటే ..
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసింది మూడో భార్య. ఆ శవాన్ని మూటగట్టి ఊరు చివర బావిలో పడేసింది. కానీ, ఆ మర్నాడు అదే బావి వద్దకు వెళ్లిన హతుడు రెండో భార్యకు ఏదో శవం తేలుతున్నట్టు కనిపించింది. అది మృతదేహం అని ఆమె భావించినా.. తన భర్త శవమే అని తెలిసి షాకయ్యింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మూడో భార్య కుట్ర వెలుగులోకి వచ్చింది. విస్తుగొలిపే ఈ ఘటన మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లా సకారియా గ్రామంలో ఆగస్టు 30న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సకారియా గ్రామానికి చెందిన భయ్యాలాల్ రజక్ (60) మూడు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య వదిలేసి వెళ్లిపోవడంతో గుడ్డి బాయి అనే మహిళను మళ్లీ వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు సంతానం కలగలేదని ఆమె చెల్లెలు మున్ని అలియాస్ విమలను పెళ్లిచేసుకోగా.. ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ, స్థానిక స్థిరాస్తి వ్యాపారి లల్లూ అలియాస్ నారాయణ్ దాస్ కుష్వాహాతో మున్నీకి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురి మధ్య సంబంధం బలపడటంతో భయ్యాలాల్ అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఇందుకోసం పథకం వేసి.. ధీరజ్ కోల్ (25) అనే యువకుడి సాయం తీసుకున్నారు.
ఆగస్టు 30న రాత్రి నిర్మాణంలో ఉన్న తన ఇంటి వద్ద భయ్యాలాల్ నిద్రపోతుండగా హత్య చేశారు. రాత్రి 2 గంటల సమయంలో లల్లూ, ధీరజ్లు చొరబడి భయ్యాలాల్ తలపై ఐరన్ రాడ్తో కొట్టి చంపారు. అనంతరం శవాన్ని దుప్పట్లో చుట్టి, తాళ్లతో కట్టి ఊరు చివర ఉన్న భావిలో పడేశారు. కానీ, రెండో భార్య ఎంట్రీతో ఆ మర్నాడే వారి ప్లాన్ బయటపడింది. ఆ బావి పక్క నుంచి ఆమె వెళ్తుండగా ఏదో శవం తెలియాడుతున్నట్టు గమనించింది. మృతదేహాన్ని బంధించి, పడేసిన భయంకరమైన దృశ్యం గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని బావిలోని నీటిని ఖాళీ చేయించి, భయ్యాలాల్ మృతదేహాం, అతడి మొబైల్ ఫోన్ను కూడా వెలికితీశారు
కేసు నమోదుచేసి పోస్ట్మార్టం కోసం తరలించగా.. తలపై బలమైన గాయాల వల్లే చనిపోయినట్టు నిర్దారణ అయ్యింది. నిందితులు ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.