Maharashtra: మహా సీఎం పదవిపై వీడని ఉత్కంఠ..
ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవికి శివసేన పట్టు;
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి నూతన ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన గట్టిగా పట్టుబడుతున్నది. శివసేన అధికార ప్రతినిధి నరేశ్ మహస్కే బీహార్ మోడల్ను గుర్తు చేస్తున్నారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా, ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించారని చెప్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ డరేకర్ మాత్రం సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఎంపిక చేయాలని కోరుతున్నారు. రాష్ర్టాన్ని నడపటానికి ఆయనే అత్యంత సమర్థుడని వాదిస్తున్నారు.
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం ఉంటుందని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ మహాయుతి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అది సాధ్యం కాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్తలు రాగానే, శివసేన నేతలు ఘాటుగా స్పందించారు. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసినందువల్ల ఆయననే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా, లోక్ సభ సభాపతి ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరయ్యేందుకు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురూ బీజేపీ నేతలతో సమావేశమై ప్రతిష్టంభనకు తెర దించుతారని తెలుస్తున్నది.
ఫడ్నవీసే సీఎం: రామ్దాస్ అథవాలే
కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే సోమవారం మాట్లాడుతూ, మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తగినవారని చెప్పారు. ఆయనకు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతిచ్చారన్నారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడుతుందన్నారు.
రెండు రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో 149 స్థానాలకుగానూ 132 చోట్ల భాజపా విజయం సాధించింది. మెజార్టీ మార్కు(145)కు కొద్దిదూరంలో ఆగిపోయింది. దాంతో శిందే, పవార్ ఇద్దరిలో ఎవరు మద్దతిచ్చినా ఫడణవీస్ సీఎం కావడానికి అన్ని అవకాశాలున్నాయి. శిందే పార్టీకి 57, పవార్ పార్టీకి 41 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.