Lawrence: లారెన్స్ బిష్ణోయ్ కుటుంబ ఖర్చులకు రూ.40 లక్షలు
జైల్లో ఉన్నా ఖర్చుకు తగ్గేదే లే;
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నా అతడి సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి వారి గ్యాంగ్ను నడిపిస్తున్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గురించి అతడి బంధువు రమేష్ బిష్ణోయ్ తాజాగా పలు సంచలన విషయాలు వెల్లడించారు.
పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను పూర్తి చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్స్టర్గా మారతాడని తానెప్పుడూ ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. జైల్లో ఉన్నప్పటికీ అతడి అవసరాల కోసం బిష్ణోయ్ కుటుంబం సంవత్సరానికి రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా రమేష్ బిష్ణోయ్ వెల్లడించారు. “ముందు నుంచి మాది సంపన్న కుటుంబమే. లారెన్స్ తండ్రి హరియాణా పోలీస్ కానిస్టేబుల్గా పని చేసేవారు. వారికి మా గ్రామంలో దాదాపు 110 ఎకరాల భూమి ఉంది. లారెన్స్ ఎప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడు. ఇప్పుడు కూడా జైల్లో ఉన్న అతడి కోసం మా కుటుంబం సంవత్సరానికి రూ.40 లక్షలు ఖర్చు చేస్తోంది’’ అని రమేష్ బిష్ణోయ్ పేర్కొన్నారు.
పంజాబ్లోని ఫిరోజ్పుర్ జిల్లా ధత్తరన్వాలీ గ్రామంలో జన్మించిన బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. పాఠశాలలో చదువుతున్న సమయంలో అతడి పేరును లారెన్స్ బిష్ణోయ్గా మార్చుకున్నాడు. అతడు యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్న సమయంలోనే పలు అసాంఘిక కార్యకలాపాలు మొదలుపెట్టాడు. డీఏవీ కాలేజీ గ్యాంగ్వార్లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేసింది. దీంతో అతడు పూర్తిగా నేరాల వైపు మళ్లినట్లు చెబుతుంటారు. 2018లో తన అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి సినీ స్టార్ సల్మాన్ఖాన్ హత్యకు కుట్రపన్నడంతో జాతీయ స్థాయిలో వార్తలకెక్కాడు.
కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ జైల్లోనే ఉంటున్నాడు. బ్యారక్ల్లోకి అక్రమంగా వచ్చే సెల్ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటూ పెద్ద పేరు గలిగిన వారిని లక్ష్యంగా చేసుకొని హత్యలకు ప్రణాళికలు రచిస్తుంటాడు. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.