లోకల్‌ రైళ్ల నుంచి కిందపడి ఆరుగురి మృతి..

మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన;

Update: 2025-06-10 01:00 GMT

మహారాష్ట్రలోని థాణె జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు లోకల్‌ రైళ్లలో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తుండగా.. పరస్పరం ఢీకొని కిందపడి ఆరుగురు మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఉదయం రద్దీ సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ముంబ్రా స్టేషన్‌ సమీపంలో మలుపు వద్ద దుర్ఘటన జరిగిందని చెప్పారు. బాధితులు రెండు రైళ్లలోని ఫుట్‌బోర్డుపైన వేలాడుతున్నారని రైల్వే సీపీఆర్‌ఓ స్వప్నిల్‌ ధన్‌రాజ్‌ నీలా తెలిపారు. ఒక రైలు కసారా వెళుతుండగా, మరో రైలు ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌కు వెళుతోందని ఆయన చెప్పారు.

ముంబై లోకల్‌ రైళ్లకు ఆటోమేటిక్‌ డోర్లు

ఘటన నేపథ్యంలో ముంబైలో కొత్త సబర్బన్‌ రైళ్లు అన్నిటికీ ఇక ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకుపోయే సౌకర్యాన్ని కల్పించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న లోకల్‌ రైళ్లకు కూడా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రైల్వే బోర్డు సమాచార, ప్రచార ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ ఢిల్లీలో తెలిపారు.

రైల్వే మంత్రి రాజీనామా చేయాలి

రైలు ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం మీద విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరాయి.

Tags:    

Similar News