Mamata: ప్రధానిగా మోడీ తప్పుకొని మరొకరికి అవకాశమివ్వాలి
ఎన్డీఏపై మమత సంచలన వ్యాఖ్యలు;
ఆదివారం మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. సాయంత్రం 7:15 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విపక్షాలకు మినహా విదేశీయులను ఆహ్వానించారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. కేంద్రంలో చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామ్యంగా ప్రభుత్వం కొలువుదీరుతోందని ఆరోపించారు. అందుకే ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీఎంసీ పాల్గొనటం లేదన్నారు.
400 సీట్లు గెలుస్తామన్న వారు కనీస మెజార్టీ మార్క్ కూడా సాధించుకోలేకపోయిందని ధ్వజమెత్తారు. కొన్ని రోజులకు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని సార్లు ప్రభుత్వాలు ఒకరోజు మాత్రమే ఉంటాయని… ఏదైనా జరిగితే.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజులు మాత్రమే ఉండొచ్చు? అని మమత జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
తాజా ఫలితాల్లో ఇండియా కూటమి 232 స్థానాల్లో విజయం సాధించింది. ఇక టీఎంసీ బెంగాల్లో 29 స్థానాల్లో గెలుపొందింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన నాలుగో పార్టీగా టీఎంసీ నిలిచింది. ఆదివారం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో ఇండియా కూటమిలో బలమైన నేతగా ఉన్న సీఎం మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి బలహీన, అనిశ్చిత ప్రభుత్వం పడిపోతేనే మాకు ఆనందం. మోదీ ప్రమాణానికి మమ్మల్ని పిలవలేదు. పిలిచినా మేం వెళ్లేవాళ్లం కాదు. అసంతృప్తులను పట్టుకుని బీజేపీ వాళ్లు మళ్లీ పార్టీలను చీలుస్తారు’’ అని మండిపడ్డారు. కాగా, తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా మమతా బెనర్జీని, లోక్సభాపక్ష నేతగా సుదీప్ బందోపాధ్యాయను, ఉపనేతగా కకోలీ ఘోష్ దస్తీదర్ను ఎన్నుకున్నారు. రాజ్యసభా పక్ష నేతగా డెరెక్ ఓబ్రయిన్ను మరోసారి నియమించారు.
ఇదిలా ఉంటే ఆదివారం జరగనున్న మోడీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఇండియా కూటమి నుంచి ఎవర్నీ ఆహ్వానించలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. స్వదేశీయులను పక్కన పెట్టి విదేశీయులను ఆహ్వానించారని ఎద్దేవా చేశారు.