Sonam Raghuwanshi: రాజా తో ఇష్టంలేని పెళ్లి.. తల్లిని ముందే హెచ్చరించిన సోనమ్
పెళ్లి తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయన్న సోనమ్;
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీ తో బలవంతపు పెళ్లిపై సోనమ్ తన తల్లిని ముందే హెచ్చరించినట్లు తెలిసింది. తాను రాజ్ కుశ్వాహాను ప్రేమిస్తున్నానని అతడినే పెళ్లి చేసుకుంటానని ఎంత చెప్పినా తల్లి ఒప్పుకోలేదట. దీంతో తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన సోనమ్.. రఘువంశీని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిన తన తల్లిని తీవ్రంగా హెచ్చరించిందంట.
‘నాకు రాజా రఘువంశీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను రాజ్ కుశ్వాహాను ప్రేమిస్తున్నా అతడినే పెళ్లి చేసుకుంటా. ఇష్టం లేదని చెబుతున్నా వినకుండా బలవంతంగా రఘువంశీతో నా పెళ్లి చేస్తున్నారు.. తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ మనిషిని ఏం చేస్తానో చూడండి. దాని పర్యవసానాలు మీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది’ అంటూ రఘువంశీతో పెళ్లికి ముందు సోనమ్ తన తల్లిని బెదిరించినట్లు రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
హత్యకు ప్లాన్ ఇలా..
మధ్యప్రదేశ్లోని ఇండోర్ వ్యాపార కుటుంబానికి చెందిన రాజ రఘువంశీ, సోనమ్కు మే 11న పెళ్లి జరిగింది. అయితే ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ఆమె తండ్రి వద్ద పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే సోనమ్ కన్నా కుష్వాహా ఐదేండ్లు చిన్నవాడు. దీంతో అతడితో పెండ్లి అంటే తన తండ్రి ఒప్పుకోడని సోనమ్ మాస్టర్ ప్లాన్ వేసింది. ముందుగా రఘువంశీని పెండ్లి చేసుకుని అతడిని చంపేస్తే తాను విధవగా మారుతానని, అప్పుడు కుష్వాహాతో వివాహానికి తండ్రి అంగీకరిస్తాడని భావించింది. ‘ముందు మనం రాజాను చంపేద్దాం. తర్వాత దానిని దోపిడీగా చిత్రీకరిద్దాం.
నేను విధవను అయిన తర్వాత మా నాన్న మన పెండ్లికి తప్పక అంగీకరిస్తాడు’ అని ప్రియునికి నచ్చజెప్పింది. ఈ మేరకు భర్తను హనీమూన్కు తీసుకుని వెళ్లింది. నలుగురు నిందితులు వీరు బసచేసిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోని హోటల్లో దిగారు. మే 23న భర్తను ఒక కొండ ప్రాంతానికి ఫొటో షూట్ పేరుతో తీసుకుని వెళ్లింది. తాను అలసిపోయినట్టు నటించిన సోనమ్ భర్తతో బాగా వెనుక నడిచి ముగ్గురు నిందితులతో మంతనాలు జరిపింది. చంపండి అని ఆమె అనగానే వారు తమతో తెచ్చుకున్న ఆయుధంతో దాడిచేసి హతమార్చారు. రఘువంశీ మృతదేహాన్ని లోయలోకి తోసేందుకు సోనమ్ నిందితులకు సహకరించింది.