Mahua Moitra: ఢిల్లీలో గ్రాండ్‌గా మహువా మొయిత్రా వివాహ రిసెప్షన్..

హాజరైన సోనియాగాంధీ;

Update: 2025-08-07 03:30 GMT

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, బిజు జనతాదళ్ (బీజేడీ) మాజీ ఎంపీ పినాకి మిశ్రా మే 30న వివాహం జరిగింది. జర్మనీలోని ఒక ప్రైవేటు వేడుకలో ఇద్దరూ ఒక్కటయ్యారు. దాదాపు రెండు నెలల తర్వాత బుధవారం ఢిల్లీలో గ్రాండ్‌గా వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. హోటల్ లలిత్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, తదితర నేతలంతా పాల్గొన్నారు.

ఇక మహువా మొయిత్రా బంగారు ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ బంగారు ఆభరణాలతో కూడిన ఎరుపు చీరలో కనిపించారు. పినాకి మిశ్రా ఎరుపు ఎంబ్రాయిడరీ అంచుతో కూడిన క్లాసిక్ తెల్లటి సాంప్రదాయ దుస్తులను ధరించారు. ఇద్దరూ కూడా అతిథులను ప్రత్యేకంగా పలకరించారు. అందరి దగ్గర ఆశీర్వాదాలు పొందారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనియా గాంధీ, రాజ్యసభ సభ్యుడు రంజీత్ రంజన్, ఇతరులతో కలిసి డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న ఫొటో కనిపించింది.

మహువా మొయిత్రా ఉద్వేగభరిత ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్. పార్లమెంట్‌లో ఆవేశ ప్రసంగాలు చేస్తుంటారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక మిశ్రా.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. 1996లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పూరీ నుంచి లోక్‌సభలోకి ప్రవేశించారు.


Tags:    

Similar News