Sam Pitroda: అగ్గి రాజేసిన పిట్రోడా వ్యాఖ్యలు

దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న పిట్రోడా... తూర్పు భారత పౌరులు చైనీయుల్లా కనిపిస్తారని వ్యాఖ్యలు

Update: 2024-05-09 00:30 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశంలో అగ్గిరాజేశాయి. ఒక వార్తా సంస్థ పాడ్‌కాస్ట్‌లో దక్షిణ భారతదేశ ప్రజలు ఆఫ్రికన్లలా, తూర్పు భారత పౌరులు చైనీయుల్లా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. చర్మం రంగును బట్టి దేశ ప్రజలను కాంగ్రెస్‌ యువరాజు, ఆయన తత్వవేత్త అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడానికి ఇదే కారణమని దుయ్యబట్టారు. పిట్రోడా వ్యాఖ్యలతో.. పార్టీకి ఎలాంటి సంబంధంలేదని కాంగ్రెస్‌ వివరణ ఇచ్చింది.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, ఈశాన్య భారతంలో చైనీయులు మాదిరిగా ఉంటారని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రకాశవంతంగా ఉందని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడక్కడా కొన్నిసార్లు ఘర్షణ పడినా 75 ఏళ్లుగా భారతీయులు సంతోషకరమైన వాతావారణంలో కలిసే జీవిస్తున్నారని పిట్రోడా చెప్పుకొచ్చారు. ఎన్నో విభిన్నతలు ఉన్నప్పటికీ భారత్ కలిసే ఉందన్న ఆయన..తూర్పు భారతదేశంలో ప్రజలు చైనీయుల్లా, పశ్చిమాన అరబ్బుల్లా, ఉత్తరాదిన తెల్లగా, దక్షిణాదిన ఆఫ్రికన్ల వలే కనిపిస్తారని చెప్పారు. ఎవరెలా ఉన్నా....... పెద్ద విషయం కాదన్న పిట్రోడా తామంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లమని పేర్కొన్నారు. గుజరాతీ అయిన తాను..దోశ, ఇడ్లీని ఇష్టపడతానని చెప్పిన ఆయన..... అవి ఇకపై దక్షిణ భారతదేశ ఆహారంకావన్నారు. తాము భాషలు, ఆచారాలు, ఆహారం, మతాలను పరస్పరం గౌరవించుకుంటామన్నారు.

దేశ ప్రజల రంగును పోల్చుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు..రాజకీయంగా పెను దుమారం రేపాయి. పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణికి నిదర్శమంటూ భారతీయ జనతా పార్టీ... మండిపడింది. అవి జాత్యహంకార వ్యాఖ్యలని ఆరోపించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చూడడానికి భిన్నంగా కనిపించినప్పటికీ మేమంతా భారతీయులం అని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్ లో పేర్కొన్నారు. తాను ఈశాన్య ప్రాంతానికి చెందినా భారతీయుడిలాగే కనిపిస్తానని చెప్పుకొచ్చారు. వరంగల్‌లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... పిట్రోడా వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. రూపురేఖలను బట్టి దేశ ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలు భారతీయుల వారసులుకాదని.. దేశాన్ని ఆక్రమించుకున్న వారి వారసులని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తోందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై దుయ్యబట్టారు. 

Tags:    

Similar News