Maharashtra: బోర్డు పరీక్షల్లో చాట్జీపీటీతో కాపీయింగ్.. మహారాష్ట్రలో 81 మంది ఉద్యోగులపై వేటు
డ్రోన్ ఫుటేజ్లో ఇన్విజిలేటర్లు కాపీయింగ్ చేయిస్తున్న దృశ్యాలు
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు అక్రమంగా సహాయం చేసినందుకు గాను 81 మంది పరీక్షా సిబ్బందిని మహారాష్ట్ర విద్యా బోర్డు సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది సమాధానాల కోసం చాట్జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను కూడా ఉపయోగించడం సంచలనం సృష్టిస్తోంది.
అధికారుల విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఒక కేంద్రంలో అటెండర్, ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా బయట ఉన్న టీచర్కు పంపాడు. ఆ టీచర్, చాట్జీపీటీని ఉపయోగించి సమాధానాలను సిద్ధం చేసి, వాటిని ప్రింట్ తీసి విద్యార్థులకు చీటీలుగా అందించినట్లు తేలింది.
బీడ్ జిల్లాలోని చౌసాల పరీక్షా కేంద్రంలో డ్రోన్ కెమెరాల ద్వారా జరిపిన నిఘాలో 16 పరీక్షా గదుల్లో సూపర్వైజర్లే విద్యార్థులకు కాపీ కొట్టేందుకు బహిరంగంగా సహకరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మరోవైపు వాషిం జిల్లాలోని మైనాగిరి మహారాజ్ కేంద్రంలో చీఫ్ సూపర్వైజర్తో సహా ఇతర సిబ్బంది, ఫిజిక్స్ పరీక్ష సమయంలో విద్యార్థులను ఫోన్లు ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేసేందుకు అనుమతించారు.
ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించిన అధికారులు, అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.