Haridwar stampede: హరిద్వార్‌లోని మాన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట..ఏడుగురు మృతి

మెట్ల మార్గంలో హైటెన్షన్ వైర్ తెగిపడటంతో విషాదం..;

Update: 2025-07-27 06:45 GMT

 ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌ లో గల మన్సాదేవి ఆలయం దగ్గర అపశ్రుతి జరిగింది. ఈరోజు (జూలై 27న) ఉదయం భారీ సంఖ్యలో భక్తులు టెంపుల్ కి తరలి వచ్చారు.. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు గర్హ్వాల్‌ కమిషనర్‌ వినయ్ శంకర్ పాండే తెలియజేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఆలయం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు.

అయితే, ఆలయం దగ్గర ఉన్న హైటెన్షన్ వైర్ తెగిపడటంతో.. విద్యుత్ షాక్ కొడుతుందనే కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. విద్యుత్‌ షాక్‌కు గల కారణాలపై విచారణ చేస్తున్నాం.. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన విషయం.. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.. అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని సీఎం ధామి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News