JP Nadda: ఎట్టకేలకు దొరికిన జేపీ నడ్డా భార్య కారు..
ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో;
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నడ్డా సతీమణి మళ్లికా ఫార్చునర్ ఎస్యూవీ కారు మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అపహరణకు గురైన విషయం తెలిసిందే. కారు డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీసింగ్ సెంటర్ నుంచి తీసుకొచ్చారు.
నడ్డా నివాసానికి చేరుకునే క్రమంలో మధ్యలో తన ఇంటి వద్ద భోజనం కోసం కారును బయట నిలిపి ఉంచారు. ఆ సమయంలో దుండగులు కారును అపహరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించినపుడు ఈ కారు గురుగ్రామ్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. సుమారు 20 రోజుల తర్వాత దానిని వారణాసిలో పట్టుబడింది.
ఫరిదాబాద్ సమీపంలోని బధ్కల్కు చెందిన షాహిద్, షివంగ్ త్రిపాఠి ఆ కారును వారణాసికి తీసుకొచ్చినట్లు తెలిపారు. భద్కల్లో కారు నంబర్ ప్లేట్ను మార్చారని, అలీగఢ్, లఖింపూర్ ఖేరి, బరేలీ, సీతాపూర్, లక్నో మీదుగా వారణాకి వచ్చారని చెప్పారు. దానిని నాగాలాండ్కు తరలించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.