Supreme Court: సనాతనం కామెంట్స్పై సుప్రీంకోర్టు సంచలనం
ఉదయనిధిపై కొత్త కేసులు నమోదు చేయొద్దన్న సుప్రీంకోర్టు;
డీఎంకే నేత, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గానూ కొత్త కేసులు ఏవీ నమోదు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ‘సనాతన ధర్మం’ పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, పలువురు తీవ్రంగా తప్పుపట్టారు. ఇక ఆయన వ్యాఖ్యలపై దేశావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. తాజాగా బీహార్లో ఇదే అంశంపై మరో కేసు నమోదైంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన బహుళ ఎఫ్ఐఆర్లను ఏకీకృతం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సనాతన ధర్మం అంశంలో కోర్టు అనుమతి లేకుండా ఉదయనిధి స్టాలిన్పై కొత్త కేసులు ఏవీ నమోదు చేయొద్దని ఆదేశించింది.
2023లో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదే లేదని తెగేసి చెప్పారు.