Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
మరో వారం లోగా సుశీల్ సరెండర్ కావాలని కోర్టు తన ఆదేశాలు;
ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లో సరెండర్ కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. గత మార్చి 4న దిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ రద్దు చేసింది. జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్ కుమార్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తన కుమారుడి హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్కు ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వడంపై సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుమార్ తరఫున ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ, ధన్కర్ తరఫున సిద్ధార్థ మృదుల్ వాదనలు వినిపించారు.
ఇదీ కేసు..
2021లో దిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో ధన్కర్తోపాటు అతడి ఇద్దరు స్నేహితులపై సుశీల్ కుమార్ దాడి చేశాడని కేసు నమోదైంది. తీవ్ర గాయాలతో ధన్కర్ ప్రాణాలు విడిచినట్లు పోస్టుమార్టంలో తేలడంతో అరెస్ట్ నుంచి 18 రోజులపాటు సుశీల్ కుమార్ తప్పించుకొన్నాడు. చివరికి ముంద్కా ప్రాంతంలో ఓ జాతీయ స్థాయి అథ్లెట్ వద్ద నగదు తీసుకొని పారిపోతుండగా దిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దీంతో బెయిల్ వచ్చే వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కుమార్ను రైల్వేశాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అక్టోబర్ 2022లో దిల్లీ ట్రయల్ కోర్టు సుశీల్ కుమార్ సహా 17 మందిపై వివిధ అభియోగాలను నమోదు చేసింది.
ఇందులో హత్య, అల్లర్లు, నేరపూరిత కుట్ర, దోపిడీ, ఆయుధాల చట్టం సెక్షన్లు ఉన్నాయి. దిల్లీ పోలీసుల ఛార్జ్షీట్ ప్రకారం కుట్రలో కుమార్ కీలక పాత్రపోషించినట్లు పేర్కొన్నారు. మరోవైపు కుమార్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. మూడున్నరేళ్లపాటు జైలులో గడిపిన తనకు బెయిల్ మంజూరు చేయాలని గత మార్చి 4న దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతడి వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.