Kidnapping case: తమిళనాడు ఏడీజీపీ సస్పెన్షన్..
సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్;
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా కళంబాక్కంకు సంబంధించిన ఓ ప్రేమ వ్యవహారంలో యువకుడి కిడ్నాప్ తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏడీజీపీ జయరామ్ ను అరెస్టు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓ సీనియర్ పోలీసు అధికారి విచారణలో పాల్గొన్నందుకు ఆయనను ఎలా సస్పెండ్ చేస్తారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. కళంబాక్కంకు చెందిన ఓ యువకుడు ఇటీవల తేనికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడి 16 ఏళ్ల సోదరుడు కిడ్నాప్ అయ్యాడు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఏడీజీపీ జయరామ్కు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇటీవల విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఏడీజీపీని అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దాంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో ఏడీజీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టైన వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏడీజీపీ హోదాలో ఉన్న తనను అరెస్టు చేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ కౌన్సిల్ వాదనలు వినిపించారు.
ఏడీజీపీని కస్టడీలోకి తీసుకుని విచారణ అనంతరం మంగళవారం సాయంత్రమే విడుదల చేశామని ఆయన సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే తనను పోలీసులు విడుదల చేసినప్పటికీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందని ఏడీజీపీ వాదించారు. దాంతో సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ఆయనొక సీనియర్ పోలీసు అధికారి అని, ఆయయను సస్పెన్షన్లో పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఆశ్యర్యం కలిగించాయని వ్యాఖ్యానించింది. ఆ ఉత్తర్వులు నిరుత్సాహపరిచేలా ఉన్నాయని కోర్టు ఆగ్రహించింది. గురువారం నాటికి ఏడీజీపీపై సస్పెన్షన్ను రద్దు చేసి.. ఆ సమాచారాన్ని న్యాయస్థానానికి తెలియజేయాలని ఆదేశించింది.