పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి ఊరట లభించింది. రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాహుల్పై లోక్సభ అనర్హత వేటు తొలగిపోనుంది. మోదీ ఇంటి పేరు కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ...ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్ దాఖలు చేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్లతోకూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టింది. రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన, గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
రాహుల్ గాంధీ నేరస్థుడు కాదని, బీజేపీ కార్యకర్తలు గతంలోనూ ఆయనపై అనేక కేసులు వేసినప్పటికీ.. ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ వాదించారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ.. రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు సుప్రీంకోర్టులోనే చివరి అవకాశమని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం సెషన్స్, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. దీంతో రాహుల్గాంధీపై పడిన అనర్హత వేటలో ఊరట లభించనుంది. సుప్రీం ఉత్తర్వుల మేరకు లోక్సభ సెక్రెటేరియట్ గతంలో విధించిన అనర్హతను తొలగించనుంది.
2019లో కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రజా ప్రాతినిథ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన లోక్సభ సభ్వత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే శిక్షపై స్టే విధించాలని కోరుతూ వేసిన పిటిషన్ను గుజరాత్ హైకోర్టు కొట్టేయగా.. దీన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది. రాహుల్పై పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే విధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.