Supreme Court: యూనియన్ ఆఫ్ భారత్ గా పేర్కొంటూ సుప్రీంకోర్టు సర్క్యులర్
న్యాయవాదులకు జారీ చేసిన సర్క్యులర్లో ప్రస్తావన;
సుప్రీంకోర్టు విడుదల చేసిన ఓ సర్క్యులర్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. యూనియన్ ఆఫ్ ఇండియాకు బదులు ‘యూనియన్ ఆఫ్ భారత్’గా పేర్కొంటూ జారీచేయటమే ఇందుకు కారణం. ఏయే అంశాల్లో వాయిదాలను కోరరాదో తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులన్నింటికీ సుప్రీంకోర్టు తాజాగా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీనికి సంబంధించి న్యాయవాదులకు జారీ చేసిన ఓ సర్క్యులర్లో ‘యూనియన్ ఆఫ్ భారత్’గా సుప్రీంకోర్టు పేర్కొనటం గమనార్హం.
గత ఏడాది భారత్లో జీ20 దేశాల సదస్సు నిర్వహించగా, జీ20 దేశాధినేతల విందు కార్యక్రమానికి కేంద్రం పంపిన ఆహ్వానంలో భారత రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా మోదీ సర్కార్ పేర్కొనటం అప్పట్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దేశం పేరు.. ఇండియా నుంచి భారత్కు మార్చనున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే రెండు పదాల్ని కూడా వాడొచ్చునని కొంతమంది న్యాయ నిపుణులు కేంద్ర చర్యల్ని సమర్థించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-1ను ప్రస్తావిస్తూ, ‘ఇండియా, భారత్ రెండూ ఒకటేనని గుర్తుచేశారు.
ఆదివారం నుంచి సుప్రీంకోర్ట్ 75 వసంతాల వేడుకలలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలను ప్రారంభించారు. సుప్రీంకోర్టు నూతన వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, ఇతర న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు నూతన వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, ఇతర న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ రోజు ప్రత్యేకమైన సందర్భమని, భారత రాజ్యాంగం ద్వారా ప్రజలు తమకు తాము ఈ కోర్టును అందించుకున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. దేశ పౌరుల మధ్య పరస్పర గౌరవం గురించి రాజ్యాంగం చెబుతోందని పేర్కన్నారు. భవిష్యత్లో దేశానికి సంబంధించిన రియల్-టైమ్ న్యాయ సమాచారాన్ని, సుప్రీంకోర్టు పర్యవేక్షణ కోసం అధునాతన సాంకేతికతతో కూడిన వార్రూమ్ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
సుప్రీంకోర్టు నూతన వెబ్సైట్ ‘సుస్వాగతం’ ఉపయోగించి 1.23 లక్షల ఫైల్స్ను డిజిటల్గా మార్చామని, వీటన్నింటినీ సురక్షితమైన, తిరుగులేని క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయంగా మార్చనున్నట్టు ఆయన చెప్పారు. ఇక సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతూ... ప్రస్తుతం దేశవ్యాప్తంగా కీలకమైన స్థానాల్లో పెద్ద సంఖ్యలో మహిళా నిపుణులు కనిపిస్తున్నారని అన్నారు. ఇంతకుముందు న్యాయవాద వృత్తి పురుషులకు మాత్రమే పరిమితమై ఉండేదని, ఇప్పుడు జిల్లా న్యాయవ్యవస్థలో 36 శాతం స్త్రీలే ఉన్నారని అన్నారు. ఇటీవల జడ్జిలుగా ఎంపికైనవారిలో మహిళలు 50 శాతానికి పైగా ఉన్నారని ప్రస్తావించారు. జడ్జిలకు సాయం అందించే క్లర్కుల్లో 41 శాతం మంది మహిళలేనని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే 75 వసంతాల వేడుకలు జరుపుతున్నారు.