CHARDHAM YATRA 2025: చార్ ధామ్ యాత్రకు 'ఉగ్ర' భయాలు
భక్తుల భద్రతపై సర్కార్ అలర్ట్!;
మరోవారం రోజుల్లో (ఏప్రిల్ 30న) ఉత్తరాఖండ్లో చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు 19.5 లక్షలకు చేరుకున్నాయి. అందులో 17 వేల మంది విదేశీ పర్యటకులు సైతం ఉన్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉత్తరాఖండ్ సర్కార్ అప్రమత్తమైంది. చార్ ధామ్ యాత్రకు వచ్చే విదేశీ భక్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది.
విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో
చార్ ధామ్ యాత్రకు భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏటా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల ప్రయాణం, దర్శనం సజావుగా, సురక్షితంగా సాగేలా ఏర్పాట్లను మెరుగుపరిచే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు తమతో పాటు చార్ ధామ్ యాత్ర గురించి ఓ సానుకూలమైన సందేశాన్ని తీసుకెళ్లేలా చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది.
భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు
చార్ ధామ్ను సందర్శించడానికి 17 వేలకు పైగా విదేశీ పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో యూఎస్, యూకే, మలేసియా, నేపాల్, ఆస్ట్రేలియాతో సహా 103 దేశాల పౌరులు ఉన్నారు. పర్యటక శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం, కేదార్ నాథ్ ధామ్కు 6100, బద్రీనాథ్కు 4800, గంగోత్రి ధామ్కు 3150, యమునోత్రికి 2750 మంది విదేశీ యాత్రికులు నమోదు చేసుకున్నారు.
19లక్షల రిజిస్ట్రేషన్లు
ఓవరాల్గా చార్ ధామ్ యాత్ర కోసం 19,95,929 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో కేదార్నాథ్ ధామ్కు 6,81,81, బద్రీనాథ్కు 6,01,278, గంగోత్రి ధామ్కు 3,54,649, యమునోత్రికి 3,23,551, హేమకుండ్ సాహిబ్కు 34,633 మంది భక్తులు నమోదు చేసుకున్నారు.
"ఇప్పటివరకు 17 వేలకు పైగా విదేశీ భక్తులు చార్ ధామ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం విదేశీ భక్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది. అలాగే గంగా హారతి ఎక్కడ నిర్వహించినా విదేశీ భక్తులకు అందుబాటులో ఉండేలా చేయాలి. తద్వారా చార్ ధామ్ యాత్రను విదేశాలలో ప్రచారం చేయవచ్చు." అని ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ తెలిపారు.
ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు
చమోలి జిల్లాలో చార్ ధామ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. యాత్ర సమయంలో బద్రీనాథ్ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేలా జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ తివారీ సూచనల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.