Tamil Nadu: స్కూల్ పిల్లలకు సినిమాలు తప్పనిసరి..! తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం..
Tamil Nadu: సినిమాలు అనేవి పిల్లలు చూడకూడదు.. అభ్యంతరకర దృశ్యాలు ఉంటాయి.. అనేదాన్ని తమిళనాడ ప్రభుత్వం తిరగరాస్తోంది.
Tamil Nadu: సినిమాలు అనేవి చిన్నపిల్లలు చూడకూడదు.. అందులో అభ్యంతరకర దృశ్యాలు ఉంటాయి.. అవి పిల్లలకు మంచిది కాదు.. ఇవన్నీ మనం తరచుగా వినే మాటలే కానీ సినిమాల వల్ల పిల్లలకు మంచి కూడా జరగవచ్చు అని కొందరు అభిప్రాయపడతారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా అదే అభిప్రాయపడింది. అందుకే స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్ను ఏర్పాటు చేసింది.
తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ప్రకారం రాష్ట్రంలోని 13,000 స్కూళ్లలో నెలకొక సారి ఒక సినిమా ప్రదర్శించబడుతుంది. అది ఏ సినిమా అని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. జులైలోని ఈ కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. మొదటి నెలలో చార్లీ చాప్లిన్ హీరోగా నటించిన సైలెంట్ సినిమా 'ది కిడ్'ను చూసి ఆనందించారు విద్యార్థులు.
సినిమాలు అనేవి విద్యార్థుల్లో ఆలోచించే శక్తిని పెంచుతాయని తమిళనాడు విద్యాశాఖ అంటోంది. వారికి చూపించడం కోసం మంచి సినిమాలను ఎంపిక చేస్తామంటూ హామీ ఇస్తోంది. కానీ ఇప్పటివరకు కేవలం ఈ కార్యక్రమం 6 నుండి 9వ తరగతులు చదువుతున్న విద్యార్థుల వరకే పరిమితమయ్యింది. దీంతో పాటు స్కూలు విద్యార్థుల కోసం మరెన్నో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది.