Tamilnadu : పులిపై రైతు ప్రతీకారం ..
తన ఆవును చంపినందుకు పులిపై విష ప్రయోగం..;
తన ఆవుపై పులి దాడిచేసి చంపేసిందని ప్రతీకారంతో రగిలిపోయాడు ఓ రైతు.. మొత్తం పులులకు విషం పెట్టి చంపేశాడు. సంచలన రేపుతున్న ఈ ఘటన తమిళనాడులోని నీల్గిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పులుల అనుమానాస్పదమృతి ఘటనలో అటవీశాఖ అధికారులు ఓ వ్యక్తిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సంఘటన వివరాల్లోకి వెళితే ..
శనివారం ఎమరాల్డ్లోని నీటి కుంటలో మూడు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు వాటికి సమీపంలో ఓ ఆవు కళేబరం లభ్యమైంది. అయితే ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పులులు, ఆవు కళేబరాల నుంచి నమూనాలను సేకరించి కోయంబత్తూరుకు పంపారు. కళేబరాలలో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడం వల్లే పులులు చనిపోయినట్టు ధ్రువీకరించారు. ఈ క్రమంలో సోమవారం ఆవు యజమాని శేఖర్ను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో శేఖర్ తానే ఆవు కళేబరాన్ని విషపూరితం చేసినట్టు వెల్లడించాడు. పది రోజుల కిందట తప్పిపోయిన తన ఆవును వెతకడానికి సమీపంలోని అడవికి వెళ్లానని, ఓ చోట ఆవు మృతదేహం కనిపించిందని, దానిని పులి చంపినట్లు గ్రహించానని తెలిపాడు. తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీసుకోవాలని భావించి.. పురుగుమందులతో దాని మృతదేహాన్ని విషపూరితం చేసినట్టు వివరించాడు.
చనిపోయినవాటిలో ఒక పులి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించకపోగా.. మరొకటి గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాబట్టే విషపూరిత ఆవు కళేబరాన్ని తిని కనీసం రెండు పులులలో ఒకటి మరణించి ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు. మరో పులి ఎలా చనిపోయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే, విషపూరిత కళేబరాన్ని తినడానికి ముందు మూడేళ్ల వయసున్న పులిని ఎనిమిదేళ్ల వయసున్న పులి చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, గాయాలున్న పులి మరణానికి కచ్చితమైన కారణాలు మరో ఫోరెన్సిక్ నిపుణుల విశ్లేషణ తర్వాత వెల్లడవుతుందని అన్నారు.