Heavy Rains: తమిళనాడును మళ్ళీ ముంచెత్తిన వర్షాలు..
విద్యా సంస్థలకు సెలవు ప్రకటన
తమిళనాడులోని పది జిల్లాలలో వచ్చే ఏడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 5.30 వరకు 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జిల్లా కలెక్టర్ చారు శ్రీ. లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు సహాయ సిబ్బంది. పాఠశాలలే కాకుండా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలకు సోమవారం సెలవు ప్రకటించారు. జనవరి 8న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. రీషెడ్యూల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రధానంగా చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, మైలదుత్తురై, నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్లో ఏడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వర్షాల కారణంగా పాత కుర్తాళం జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడాన్ని నిషేధించామని అధికారులు తెలిపారు. తమిళనాడులోని నాగపట్నంలో జనవరి 7వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి జనవరి 8వ తేదీ ఉదయం 5.30 గంటల మధ్య అత్యధికంగా 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 120 మిమీ కంటే ఎక్కువ వర్షం కురిస్తే.. కొన్ని చోట్ల 250 మిమీ కంటే ఎక్కువ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. దీని కారణంగా విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో ప్రజలు కటిక చీకటిలో అలాగే కాలం వెళ్లబుచ్చుతున్నారు. అక్కడి ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తమిళనాడులోని ఐదు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు కలెక్టర్లు ఈరోజు సెలవులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో 22 సెం.మీ వర్షపాతం నమోదైందదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పలు చోట్ల రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు చేర్చారు.