Jammu Kashmir : అందుకే మళ్లీ పుల్వామాలో ఉగ్రదాడి..
Jammu Kashmir : జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు.
Jammu Kashmir : జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో ఓ వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోగా..మరో ఇద్దరు వలస కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గదురా గ్రామంలో వలస కార్మికులే లక్ష్యంగా టెర్రరిస్టులు గ్రెనెడ్ విసిరారు. మృతుడు బిహార్కు చెందిన మహమ్మద్ ముంతాజ్గా గుర్తించారు. గాయపడిన ఇద్దరు మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ మఖ్బుల్ సైతం బిహార్కు చెందినవారేనని అధికారులు చెప్పారు. గాయపడిన ఇద్దరిని పోలీసులు సమీప హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో పోలీసులు, సైన్యం అలర్ట్ అయింది. ఆ ప్రాంతంలో తనీఖీలు ముమ్మరం చేసింది.
జమ్ము కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 ఎత్తివేసి మూడేళ్లు గడుస్తున్న వేళ ఈ దాడి జరగడం చర్చకు దారి తీసింది. 2019 ఆగష్టు 5న జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించారు. ఆర్టికల్ 370 ఎత్తివేశారు. ఈ నిర్ణయంపై జమ్ము కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు భగ్గుమన్నాయి. చరిత్రలో చీకటి రోజని అభివర్ణించాయి.
2019 నుంచి జమ్ము కశ్మీర్లో వలస కార్మికులు టార్గెట్గా టెర్రరిస్టుల దాడులు పెరిగాయి. కశ్మీర్ పండిట్స్, హిందువులే లక్ష్యంగా చేస్తున్న దాడులు సవాల్గా మారాయి. గత మే, జూన్లో జరిగిన దాడుల భయంతో వేలాది మంది కశ్మీరి పండిట్లు కశ్మీర్ వ్యాలీలో విధులకు హాజరుకావట్లేదు. చాలా మంది ఉద్యోగులు కశ్మీర్ వ్యాలీలో బిక్కు బిక్కు మంటూ బతకలేక జమ్ముకు వలస వెళ్లారు