Cabinet Decisions: విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
విద్యార్థులకు ఇంటర్న్షిప్;
విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021-22 నుంచి 2025-26 మధ్య రూ.10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ పథకం కింద 11వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, యూజీ, పీజీ, పీహెచ్డీ, పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ విద్యార్థులకు ఫెలోషిప్లు అందించనుంది.
అధునాతన పరిశోధనల కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్లు వంటివి ఈ పథకంలో ఉంటాయి. ఆర్థిక, పర్యావరణ, ఉపాధి కోసం జీవసాంకేతిక విజ్ఞానం(బయో ఈ3) విధానానికి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వచ్ఛ ఇంధన, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ, పరిశోధన, ఈ రంగంలోని నూతన సాంకేతికత ప్రోత్సాహానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.