Kolkata Doctor Rape and Murder Case: నన్ను బలవంతంగా ఈ కేసులో ఇరికించారు..
నేను నిర్దోషిని అంటూ న్యాయమూర్తికి తెలిపిన సంజయ్ రాయ్;
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కోర్టులో తన వాదనను వినిపించాడు. శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదనను వినిపించుకోవడానికి జడ్జి అతడికి అవకాశం కల్పించారు. తాను ఏ నేరం చేయలేదని ఈ సందర్భంగా సంజయ్ కోర్టుకు వెల్లడించాడు.
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ ను కోర్టు దోషీగా తేల్చింది. అయితే, ఈ రోజు సీల్దా కోర్టు అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి అనిర్బన్ దాస్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. సంజయ్ రాయ్ మాట్లాడుతూ.. వారు నన్ను బలవంతంగా పత్రాలపై సంతకం చేయించారు.. నేను నిర్దోషిని అని పేర్కొన్నాడు.
ఏ కారణం లేకుండా తనను ఈ కేసులో ఇరికించారు అని నిందితుడు సంజయ్ రాయ్ పేర్కొన్నాడు. తాను ఎప్పుడూ రుద్రాక్ష గొలుసు ధరిస్తానని తను నేరం చేసి ఉంటే, అది నేరం జరిగిన ప్రదేశంలో విరిగిపోయేదన్నాడు. పోలీసులు, సీబీఐ అధికారులు తనని అసలు మాట్లాడనివ్వలేదన్నాడు.. చాలా కాగితాలపై బలవంతంగా సంతకం చేయించుకున్నారాని, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కోర్టులో సంజయ్ రాయ్ చెప్పాడు.
ఇక, సంజయ్ రాయ్ స్టేట్మెంట్లకు జడ్జి అనిర్బన్ దాస్ సమాధానమిస్తూ.. నాతో మాట్లాడేందుకు దాదాపు సగం రోజుల సమయం ఇచ్చాను.. మూడు గంటల పాటు నీ మాటలు విన్నాను.. నా ముందు సమర్పించిన అభియోగాలు, సాక్ష్యాలు, పత్రాలు, సాక్షులు అన్నీ పరిశీలించా.. వాటి ఆధారంగానే నిన్ను దోషిగా గుర్తించాను అని పేర్కొన్నారు. మీరు ఇప్పటికే దోషిగా నిరూపించబడ్డారని వెల్లడించారు.