దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 4 శుక్రవారం రోజును ఈ భేటీ జరగనుంది. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి పార్లమెంట్ ఉభయ సభల్లోని ఆయా పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు వర్చువల్ పద్ధతిలో పాల్గొననున్నారు. ఈ సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమన్వయం చేయనుంది..
దేశంలో కరోనాతో ఏర్పడిన సంక్షోభం తర్వాత ఇది రెండో అఖిలపక్ష సమావేశం. ఈ సమావేశంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరు కానున్నారు.
దేశ రాజధాని దిల్లీ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బడ్జెట్ సమావేశాలతో కలిపి నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ సమయంలో ఈ అఖిలపక్ష భేటీ జరగడం ప్రాధన్యత సంతరించుకుంది. మరోవైపు, దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 38,772 కేసులు, 443 మరణాలు నమోదయ్యాయి.