Union Budget 2024: పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
రూ.48.20 లక్షల కోట్లతో నిర్మలమ్మ పద్దు;
పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి.. వికసిత భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.48.20 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా.. దానిని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్నవారికి ముఖం చాటేశారు. తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత భాజపాకు దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థికమంత్రి ఈసారి ఆ లోటును భర్తీచేసే ప్రయత్నం చేశారు.
యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. ప్రైవేటు సంస్ధలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలినెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో కోటిమంది రైతులను ప్రకృతి సాగువైపు మళ్లించాలని నిర్ణయించారు. వీరికి చేయూతనివ్వడానికి 10 వేల జీవ ఎరువుల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బంగారం, మొబైళ్లపై సుంకాలు తగ్గిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా తొమ్మిది ప్రాధాన్య అంశాలను మంగళవారం పార్లమెంటు ముందుంచారు. ఆమెకు ఇది వరసగా ఏడో బడ్జెట్.
2019 ఎన్నికల్లో భాజపా గెలిచిన 303 సీట్లు 2024 నాటికి 243కు పడిపోవడానికి దారితీసిన కారణాలనువిశ్లేషించుకొని వాటిని సరిదిద్దుకొనే దిశలో ఈసారి బడ్జెట్ తీసుకొచ్చారు. మోదీ మూడోసారి అధికారం చేపట్టడానికి చేయూతనిచ్చిన ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా ప్రజల రుణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న బిహార్కు రూ.60,000 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా సాధించాలన్న సంకల్పంతో చేనేతకారులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులకు పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషన్, స్టాండప్ ఇండియాల ద్వారా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేశీయ విద్యాసంస్థల్లో చదువుకోసం తీసుకునే రూ.10 లక్షల్లోపు రుణాలపై 3% వడ్డీ రాయితీ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ద్వారా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.