POWER PROJECTS: అణు విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్ర విద్యుత్ శాఖ దృష్టి
అణు విద్యుత్ బాధ్యతల బదిలీకి కేంద్రం ప్రతిపాదన...IAEA రియాక్టర్ల ప్రాజెక్టులు విద్యుత్ శాఖ పరిధిలోకి?....డీఏఈ నుంచి విద్యుత్ శాఖకు ఉత్పత్తి బాధ్యతలు?
భారతదేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే భారీ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇంధన రంగంలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా దేశంలోని అణు విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి బాధ్యతలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. దేశ ఇంధన రంగంలో గణనీయమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అణు విద్యుత్ ఉత్పత్తిలో వేగాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలకు సిద్ధమవుతోంది. అణు విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను తన పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు కేబినెట్ సెక్రటేరియట్కు చేరినట్లు సమాచారం. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పరిధిలోని రియాక్టర్లతో చేపట్టే ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ఇందుకోసం వ్యాపార నిబంధనల కేటాయింపులో అవసరమైన సవరణలు చేయాలని ప్రతిపాదనలు పంపింది.
ప్రస్తుతం, అణు విద్యుత్ రంగానికి సంబంధించిన పూర్తి పరిపాలనా అధికారాలు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఆధ్వర్యంలోని అణు శక్తి విభాగం (DAE) చేతిలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే, అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాని కార్యాలయం నుంచి విద్యుత్ శాఖకు అధికారాలు బదిలీ అవుతాయి.ఈ పరిణామాలు డిసెంబర్ 2025లో ప్రకటించిన 'సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా' (SHANE - శాంతి) చట్టం నేపథ్యంలో రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అణు రంగంలో నియంత్రిత పద్ధతిలో పరిమిత ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించడం, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డును (AERB) బలోపేతం చేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ చట్టం అమలులోకి వస్తే, అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం అవుతుంది.అయితే, భద్రత, అణు ఇంధనం, వ్యూహాత్మక ప్లాంట్ల నిర్వహణ వంటి కీలక అంశాలు యథాతథంగా డీఏఈ పరిధిలోనే ఉంటాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేవలం విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ బాధ్యతలను మాత్రమే విద్యుత్ శాఖకు బదిలీ చేయడం ద్వారా అణు విద్యుత్ ప్రాజెక్టుల అమలులో వేగం పెరుగుతుందని, తద్వారా లక్ష్య సాధనకు మరింత దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారతదేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యం చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ 100 గిగావాట్లలో, ఎన్పీసీఐఎల్ ద్వారా 50 గిగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా మరో 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ భారీ లక్ష్య సాధనకు తాజా మార్పులు మరియు విద్యుత్ శాఖ ప్రమేయం కీలకం కానుంది. టారిఫ్ల విషయానికొస్తే, 1962 అణు శక్తి చట్టం ప్రకారం గతంలో డీఏఈ ధరలను నిర్ణయించేది. అయితే, రాబోయే కొత్త నిబంధనలు, 'శాంతి' చట్టం ద్వారా టారిఫ్ నిర్ణయాధికారంపై మరింత స్పష్టత రానుంది. అంతిమంగా ధరల నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉండనుందని తెలుస్తోంది. ఈ మార్పులన్నీ దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారతదేశ ఆశయానికి అండగా నిలుస్తాయని భావిస్తున్నారు.