అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవ వేళ ఉత్తర్ప్రదేశ్లోని రామ్పుర్లో 300 ఏళ్ల నాటి రామాయణ గ్రంథం వార్తల్లోకెక్కింది. పర్షియన్ భాషలో ఉన్న ఈ ఇతిహాసాన్ని అరబిక్ పద్యంతో మెుదలుపెట్టి సుమైర్ చంద్ అనే పండితుడు 1715లో రచించారు.
ఉత్తర్ప్రదేశ్ రామ్పుర్లోని 250 ఏళ్ల నాటి రజా గ్రంథాలయం విలువైన చేతిరాత ప్రతులు, చారిత్రక పత్రాలు, ఇండో-ఇస్లామిక్ పుస్తకాలకు నిలయం. ఈ గ్రంథాలయంలో 300 ఏళ్ల నాటి పర్షియన్ భాషలో ఉన్న రామాయణ గ్రంథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రామాయణ ఇతిహాసాన్ని 1715లో ప్రసిద్ధ పండితుడు సుమైర్ చంద్ పర్షియన్ భాషలోకి అనువదించారు. ఈ రాతపత్రం ప్రత్యేకత ఏమిటంతే బిస్మిల్లా అల్-రెహ్మాన్ అల్-రహీమ్ అన్న అరబిక్ పద్యంతో రచయిత రామాయణ గ్రంథాన్ని రాయడం మెుదలుపెట్టారు. బిస్మిల్లా అల్-రెహ్మాన్ అల్-రహీమ్ అంటే అల్లాహ్ పేరుతో లేదా దయగలవారు అని అర్థం. ఖురాన్లో ఒక అధ్యాయాన్ని చదవడం లేదా ఏదైనా పనిని ప్రారంభించే ముందు ముస్లింలు ఈ పదబంధాన్ని తరచుగా పఠిస్తుంటారు.
రజా గ్రంథాలయం పర్షియన్ భాషలో ఉన్న రామాయణాన్ని హిందీలోకి కూడా అనువదించి మూడు విభిన్న సంపుటాలలో ప్రచురించింది.ఈ రాతపత్రంలోని సుగ్రీవ, వాలీ, రాముడు, సీత, లక్ష్మణుడి చిత్రాలను చూస్తే రామాయణాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. పర్షియన్ భాష అర్థం కాని వారి కోసం రజా గ్రంథాలయం ఈ రాతపత్రాన్ని హిందీలోకి కూడా అనువదించింది.బంగారం, విలువైన రాళ్లతో అలంకరించబడిన ఈ రాతపత్రాన్ని 19వ శతాబ్దంలో నవాబ్ యూసుఫ్ అలీ ఖాన్ పాలనలో రాంపూర్కు తీసుకవచ్చి రజా గ్రంథాలయంలో భద్రపర్చినట్లు అక్కడి ప్రజలు నమ్ముతారు.