Jai Shri Ram: ‘జై శ్రీ రాం’ అని రాసినందుకు ఎగ్జామ్ పాస్
యూపీ యూనివర్సిటీలో కొత్త స్కామ్;
ఉత్తరప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. డీ ఫార్మసీ పరీక్షలో ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు, క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను పాస్ చేశారు. ఇద్దరు విద్యార్థుల ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమను పాస్ చేసేందుకు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లను వీసీ డిస్మిస్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ‘జై శ్రీరాం’ నినాదాలు, క్రికెటర్ల పేర్లను సమాధానాలుగా రాసి పరీక్షల్లో పాసైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాటలు, మ్యూజిక్, మతపరమైన నినాదాలను ఆన్సర్ పేపర్లో రాశారు. అయితే, ఈ ఘటనలో వారిని పాస్ చేసేందుకు ప్రొఫెసర్ డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. ఈ ఆరోపణలపై జాన్పూర్లోని వీర్ బహదూర్ పర్వాంచల్ విశ్వవిద్యాలయంలోని ఇద్దరు ప్రొఫెసర్లు సస్పెండ్ అయ్యారు. సున్నా మార్కులు వచ్చిన విద్యార్థులకు కూడా కొందరు అధికారులు అండగా నిలిచి 60 శాతం మార్కులతో పాస్ చేశారని ఆరోపిస్తూ, యూనివర్సిటీ విద్యార్థి నేత దివ్యాంశు సింగ్ ప్రధాని మోడీతో పాటు గవర్నర్, ముఖ్యమంత్రి, వైస్ ఛాన్సలర్లకు లేఖ రాశారు.
ఆర్టీఐ ద్వారా ఈ బాగోతం అంతా వెలుగులోకి వచ్చింది. ‘‘విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణ ఉంది. అందుకే మేము ఓ కమిటీ ఏర్పాటు చేశాము. ఆ కమిటీ తన నివేదికలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు కేటాయించినట్లు పేర్కొంది’’ అని వైస్ ఛాన్సలర్ వందనా సింగ్ అన్నారు. మతపరమైన నినాదాల గురించి ప్రశ్నించగా.. ‘‘జై శ్రీరామ్’’ సమాధానాలు ఉన్న కాపీని చూడలేదని చెప్పారు. జై శ్రీరాం నినాదంతో పాటు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్ పేర్లను పరీక్షా పత్రాల్లో ఉన్నాయి. బుధవారం జరిగిన పరీక్షల కమిటీ సమావేశంలో ఎగ్జామినర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చేశారు.