Sasikala: ఎన్నికల ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి శశికళ ఎంట్రీ

ఎంజీఆర్ పేరు మీద ‘ఆలిండియా పురుచ్చి తలైవార్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం’ పార్టీ ప్రకటన

Update: 2026-03-13 08:45 GMT

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు సొంత పార్టీని ప్రకటించారు. ‘ఆలిండియా పురుచ్చి తలైవార్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం’ (AIPTMMK) అనే పార్టీని స్థాపించి మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్‌ను అభిమానులు 'పురుచ్చి తలైవార్' అని పిలుచుకుంటారు. ఆయన గౌరవార్థం తన పార్టీ పేరులో ఆ పదాన్ని చేర్చడం ద్వారా శశికళ క్యాడర్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

తన పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్టు’ను ఆమె ప్రకటించారు. జయలలిత అసలైన వారసురాలిగా తనను తాను నిరూపించుకోవాలని శశికళ చూస్తున్నారు. జయలలిత మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, ఆపై జైలు శిక్ష కారణంగా ఆమె రాజకీయ ప్రస్థానానికి అప్పట్లో విరామం పడింది. అయితే ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా ఏఐఏడీఎంకే ఓటు బ్యాంకుపై ఆమె ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీ ప్రకటన సందర్భంగా ఎంజీఆర్, జయలలిత విగ్రహాలకు నివాళులర్పించిన శశికళ... రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ కొత్త పార్టీ ఆవిర్భావం అధికార, ప్రతిపక్ష పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News