Maha Kumbh Mela 2025: కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు..

చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని తప్పుడు సమాచారం.;

Update: 2025-01-16 06:45 GMT

ప్రయాగ్‌రాజ్‌‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారిపై యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. కుంభమేళా నేపథ్యంలో చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని, చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారని, అలాగే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన లలూ యాదవ్‌ సంజీవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు సంజీవ్‌ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా చెప్పుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. కుంభమేళాపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అశాంతి, అలజడికి కారణమయ్యే ఎటువంటి చర్యలకు ప్రభుత్వం సహనంగా ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి లక్నోలో నైట్‌ షెల్టర్‌ను సందర్శించి.. అక్కడ చలిలో బాధపడుతున్న వారికి దుప్పట్లు, స్వెటర్లను పంపిణీ చేశారు.

ఇక నేటితో ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలో జరుగుతున్న కుంభమేళా నాలుగో రోజుకు చేరుకుంది. భక్తులు, సాధువుల రద్దీతో కిటకిటలాడుతున్న ఈ ఉత్సవాన్ని కోట్లాదిమంది ప్రజలు సందర్శిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ముఖ్యంగా కుంభమేళా ప్రాంగణంలో వైద్య శిబిరాలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయని, అస్వస్థతకు గురైన భక్తులకు వెంటనే వైద్యం అందించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. కుంభమేళా సందర్భంగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా పర్యవేక్షణ జరుగుతుందని యోగి ప్రభుత్వం తెలియజేసింది. భక్తుల శ్రేయస్సు కోసం ప్రతి చర్య తీసుకుంటున్నామని, తప్పుడు ప్రచారాలను సహించబోమని ప్రభుత్వం హెచ్చరించింది.

Tags:    

Similar News