Vande Bharat: కాషాయ వర్ణంలో వందేభారత్‌ రైలు

కాషాయ రంగులోకి మారిన వందేభారత్ రైళ్లు.... పరిశీలించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌... భారత త్రివర్ణ జెండానే స్ఫూర్తని వెల్లడి....;

Update: 2023-07-09 12:00 GMT

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్ల రంగు మారింది. ఇప్పటి వరకూ తెలుపు, నీలం వర్ణంలో ఉన్న వందేభారత్ రైళ్లు.. ఇకమీదట కాషాయ రంగులో కనిపించనున్నాయి. ఈ రైళ్లకు కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. త్వరలో ప్రారంభం కాబోయే వందే భారత్ రైలుకు కాషాయ రంగు వేశారు. చెన్నైలోని ఇంటెగ్రెల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో కాషాయ రంగుతో సిద్ధంగా ఉన్న వందే భారత్‌ రైలును కేంద్రం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పరిశీలించారు. ఆరెంజ్, వైట్, బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న నవ వందే భారత్ రైళ్ల ఫొటోలను వైష్ణవ్ ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రస్తుతం ప్రస్తుతం నీలం, తెలుపు రంగులో ఉండగా.. ఇకపై కాషాయ వర్ణంలో మారాయి. తెలుపు రంగులో ఉన్న రైళ్లను శుభ్రం చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని, అందుకే ఆ రంగుల స్థానంలో కాషాయం వర్ణంలోకి మార్చుతున్నామని తెలిపారు. తలుపులకు నలుపు రంగు వేస్తున్నారు.


భారత త్రివర్ణ పతాకం స్ఫూర్తితోనే వందే భారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఇది మన దేశ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులతో దేశంలోనే రూపుదిద్దుకున్న మేక్ ఇన్ ఇండియా భావన అని ఆయన వెల్లడించారు. వందే భారత్ రైలుకు ఇప్పటి వరకు 25కు పైగా మెరుగులు దిద్దినట్లు చెప్పారు. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త మార్పులలో ఫీల్డ్ యూనిట్ల నుంచి వచ్చిన అన్ని ఇన్‌పుట్‌లను పొందుపరిచిందని ఆయన చెప్పారు.


చెన్నైలోని ఐసీఎఫ్‌లో ఇప్పటి వరకూ 25 రకాల డిజైన్లలో 70 వేల బోగీలు తయారయ్యాయి. వందే భారత్‌ రైలు బోగీలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఐసీఎఫ్‌లో తయారైన మొత్తం 25 వందే భారత్‌ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తున్నాయి. 2023-24లో ఈ కర్మాగారంలో 736 వందే భారత్‌ రైలు బోగీలు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


త్వరలోనే దేశవ్యాప్తంగా సంప్రదాయక పర్యాటక మార్గాల్లో ప్రయాణించే ‘టి ట్రైన్‌’లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ రైళ్లకు ‘హెరిటేజ్ స్పెషల్’ అని పేరు పెట్టారు. ప్రాచీన ‘స్టీమ్‌ ఇంజన్‌’ తరహాలో రూపొందించిన విద్యుత్‌ రైలింజన్‌తో కూడిన ‘టి ట్రైన్‌’ను చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో మంత్రి లాంఛనంగా ఆవిష్కరించారు.

భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని రైళ్లను చేర్చనున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే దీనిని స్టీమ్ ఇంజన్ సహాయంతో నిర్మించనున్నారు. ఈ హెరిటేజ్‌ స్పెషల్‌ రైలును మూడు నెలల్లోనే దేశంలో నడపనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలును తొలుత ప్రయోగాత్మకంగా పురాతన చారిత్రక స్థలాల మార్గాల్లో నడుపుతామని, ఆ ట్రయల్‌ రన్‌ పూర్తయ్యాక దేశంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెడతామని చెప్పారు. 

Tags:    

Similar News