లడఖ్లో బుధవారం హింసాత్మక నిరసనలు చెలరేగాయి. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ప్రకారం గిరిజన హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘర్షణల్లో పలువురు మరణించగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం. సుమారు 50 మందిని అరెస్టు చేశారు.
ఈ హింసకు ప్రేరేపించినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రముఖ వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను నిందించింది. 15 రోజుల నిరాహార దీక్షను ముగించిన ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడి చేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, ఈ ఘటనలో దాదాపు 30 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కాల్పులు జరిపారని, దీంతో ప్రాణ నష్టం జరిగిందని పేర్కొంది.
ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఈ అల్లర్లు సాయంత్రం 4 గంటలకల్లా అదుపులోకి వచ్చాయి. లడఖ్ ప్రజల డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం ఆలస్యం చేయడమే ఈ నిరసనలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.