కేరళోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ 50 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. తొలుత వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి తప్పుకోవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉన్నారు. వయనాడ్ ఉప ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ దూసుకుపోతుండడంతో ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ ప్రజలు.. తనకే అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వయనాడ్ ను వదిలేశారని.. ప్రజలు కాంగ్రెస్ పై కోపంతో ఉన్నారని అన్నారు. వచ్చే రౌండ్లలో తన ఆధిక్యం పెరుగుతుందన్నారు. తొలి రౌండ్ లో ప్రియాంక గాంధీ మూడు వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
'ప్రియాంక, రాహుల్ కలిస్తే బీజేపీకి చుక్కలే'
కేరళలోని వయనాడ్ లోక్సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ కచ్చితంగా విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రియాంక, రాహుల్ గాంధీ కలిస్తే బీజేపీకి నిద్రలేని రాత్రులు తప్పవని అన్నారు. వయనాడ్ నుంచి ప్రియాంక చరిత్రాత్మక విజయం సాధించాలని అందరం ఎదురుచూస్తున్నామని సచిన్ వెల్లడించారు. పార్లమెంట్లో కేరళ ప్రజల కోసం ప్రియాంక గళమెత్తుతారని సచిన్ అన్నారు.