Gang Rape: ప్రియుడిని కొట్టి బంధించి .. యువతిపై గ్యాంగ్రేప్..
పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు;
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత ఆదివారం బాయ్ఫ్రెండ్తో సరదాగా బీచ్కు వెళ్లిన 20 ఏండ్ల ఓ యువతిపై కొంతమంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. గోపాల్పూర్ బీచ్లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న బాధితురాలు, ఆదివారం ‘రాజా ఫెస్టివల్’ను పురస్కరించుకొని.. తన బాయ్ఫ్రెండ్తో బీచ్కు వెళ్లింది. అక్కడ 10 మందితో కూడిన ఓ గుంపు వారిని చుట్టుముట్టి, నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లిపోయింది. బాయ్ఫ్రెండ్ను నిర్బంధించి, యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేసినట్టు బెర్హాంపూర్ జిల్లా ఎస్పీ సరవణ వివేక్ మంగళవారం చెప్పారు. నిందితుల్లో నలుగురు మైనర్లు ఉన్నారని, అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డ మైనర్లను పెద్దలుగానే పరిగణించాలని కోర్టును కోరనున్నట్టు ఎస్పీ తెలిపారు. నిత్యం ఎంతోమంది సందర్శించే బీచ్ రిసార్ట్ టౌన్ గోపాల్పూర్లో సామూహిక లైంగికదాడి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ఘటనపై సమగ్రమైన దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
సుమోటోగా స్వీకరించిన ఎన్సీడబ్ల్యూ
ఘటనను తీవ్రంగా ఖండించిన సీఎం మోహన్ చరణ్ మాఝీ, ‘మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరం’గా అభివర్ణించారు. కేసును జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సుమోటోగా స్వీకరించింది. మూడు రోజుల్లోగా యాక్షన్ రిపోర్ట్ను సమర్పించాలంటూ ఒడిశా డీజీపీని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఆదేశించారు. గ్యాంగ్రేప్ ఘటనను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
పర్యాటక ప్రదేశాల్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని విపక్ష నేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రజా భద్రతలో వైఫల్యానికి బీజేపీ సర్కార్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిరదౌస్ అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.