Ahmedabad: గుజరాత్లో వంద కోట్ల విలువైన బంగారం స్వాధీనం
అక్రమ బంగారంపై గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారుల సోదాలు;
గుజరాత్లో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో కిలోల కొద్దీ బంగారం, డబ్బుల కట్టలు చూసి అధికారులు, పోలీసులు షాక్కు గురయ్యారు. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్ పల్దీ ప్రాంతంలో ఆవిష్కార్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్పై అధికారులు దాడులు చేపట్టగా, దాదాపు 90 కోట్ల రూపాయల విలువ జేసే బంగారం కడ్డీలు, ఆభరణాలు, నగదు లభ్యమైనట్టు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. ఈ దాడులకు సంబంధించి మేఘ షా, అతడి తండ్రి మహేంద్ర షాలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. డీఆర్ఐ, ఏటీఎస్ అధికారులు ఫ్లాట్కు చేరుకునే ముందు, ఫ్లాట్కు తాళం వేసి నిందితులు ఇద్దరూ అక్కడ్నుంచి పారిపోయారని పోలీసులు చెప్పారు. బంగారం మూలాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ‘సుమారుగా 95.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.60-70 లక్షల నగదు సీజ్ చేశాం. నిందితులు అక్రమంగా తరలించిన బంగారం, భారీగా నగదును ఫ్లాట్లో దాచిపెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి’ అని ఏటీఎస్ అధికారి ఎస్ఎల్ చౌదరీ చెప్పారు.