Chhattisgarh | ఛత్తీస్గఢ్లో పోలీసులే లక్ష్యంగా మందుపాతర..
ఓ జవాను మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు;
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని భోపాల్పట్నం పరిధి ఉల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. సోమవారం తెల్లవారుజామున జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు ఇంద్రావతి నేషనల్ పార్క్లో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉల్లూరు సమీపంలో ఏర్పాటు చేసిన మందుపాతర ని మావోయిస్టులు పేల్చారు. దీంతో డీఆర్జీ జవాన్ దినేశ్ నాగ్ అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని దవాఖానకు తరలించారు. ఈమేరకు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.