Mississippi Shooting: అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి, పలువురికి గాయాలు
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఫుట్బాల్ మ్యాచ్ , అనంతరం చోటు చేసుకున్న కాల్పులు
అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేపాయి. లేలాండ్ పట్టణంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పది మందికి పైగా గాయపడ్డారు. మిసిసిపీ రాష్ట్ర సెనేటర్ డెరిక్ సిమ్మన్స్ ఈ ఘటనను ధృవీకరించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించారు.
మ్యాచ్ అనంతరం ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఆ సమయంలో కాల్పులు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని జాక్సన్ నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కాల్పులకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని నగర మేయర్ జాన్లీ ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు లేలాండ్ పోలీస్ డిపార్టుమెంట్ తెలిపింది.