Vishakapatnam: విశాఖలో జనసేనాని 3వ రోజు పర్యటన
వాలంటీర్ చేతిలో హత్యకు గురైన.. వృద్ధురాలి కుటుంబసభ్యులను పరామర్శించనున్న పవన్;
విశాఖలో జనసేనాని 3వ రోజు పర్యటన కొనసాగుంది. కాసేపట్లో పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్లో పవన్కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన..వృద్ధురాలి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. ఇక సాయంత్రం విశాఖలోని సీఎస్బీసీ ల్యాండ్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. మరోవైపుహైటెన్షన్ మధ్య పవన్కళ్యాణ్ విశాఖ పర్యటన సాగుతుంది. పవన్కు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నిన్న రిషికొండ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పవన్ కాన్వాయ్ లోని కేవలం 5 వాహనాలకు మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పవన్ వెంట వచ్చిన నాయకుల వాహనాలను జోడుగులపాలెం వద్ద నిలిపివేశారు. రుషికొండ వద్ద కాలినడకనే రోడ్డు మీద నుంచి నిర్మాణాలను పరిశీలించారు పవన్. రుషికొండ వెళ్లే మార్గంలో జనసేన కార్యకర్తలు ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
మరోవైపు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని. ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారంటూ పవన్ విరుచుకుపడ్డారు. వైసీపీ పాలకులు విపత్తుల నుంచి కాపాడే కొండనూ వదలడం లేదన్నారు. రుషికొండను అడ్డగోలుగా తవ్వుకుంటూ వెళ్తున్నారంటూ పవన్ ఫైర్ అయ్యారు. ఒక్క రాజధానికే దిక్కులేదు... మూడు రాజధానులు అంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే అతిక్రమిస్తున్నారని విమర్శించారు.