రేషన్కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని సేకరిస్తున్నారు. ఇందు కోసం ఆధార్ ధ్రువీకరణ, వేలిముద్రలు, కంటిపాప గుర్తింపును తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయింది.
ఈ కేవైసీ తప్పకుండా పూర్తి చేసుకోవాలన్న అధికారుల సూచనతో రేషన్ దుకాణాల వద్దకు లబ్ధిదారులు భారీగా తరలివస్తున్నారు. అయితే కొత్త రేషన్కార్డులకు అర్హులైన లబ్ధిదారులను అధికారులే ఎంపిక చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆన్లైన్ వెరిఫికేషన్ ద్వారా తెల్ల రేషన్కార్డులు ఎవరికీ ఇవ్వాలో తేల్చాలని.. అనర్హులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.