ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల అనుచరులు సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన అనుచరులు.. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సమావేశమయ్యారు. ఈ భేటీలకు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ హాజరయ్యారు.
రేపు హైదరాబాద్ నుంచి ఖమ్మం పట్టణానికి తుమ్మల రానుండటంతో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.. కూసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. వెయ్యి కార్లు, రెండు వేల బైక్లతో ఖమ్మం వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెబుతున్నారు. ఈ ర్యాలీ ద్వారా తుమ్మల వర్గీలయులు బల ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలోనే తుమ్మల నాగేశ్వరరావు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.