Muhammad Yunus: బంగ్లాదేశ్ ఎన్నికలపై మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు

కొన్ని సంస్కరణలు పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి;

Update: 2025-05-29 05:58 GMT

రాజకీయంగా అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో ఎన్నికల నిర్వహణ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య కాలంలో ఎన్నికలు జరగవచ్చని ఆయన తెలిపారు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

"కొన్ని సంస్కరణలు చేపడుతున్నామని, అవి పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తామని" యూనస్ చెప్పారు. గత ఏడాది రిజర్వేషన్ల అంశంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో వందలాది మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆమె దేశం విడిచి, ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. 

Tags:    

Similar News