IND vs ENG: నేడే మూడో టీ20
సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీమిండియా.. బరిలో నిలవాలన్న కసితో ఇంగ్లాండ్;
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. రాజ్కోట్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్లోనూ నెగ్గి మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరీస్ను ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. అటు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంది.
సూర్య గాడిలో పడతాడా..?
భారత జట్టు పగ్గాలను అందుకున్న సూర్య కుమార్ యాదవ్.. కెప్టెన్ అయ్యాక స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. సారథిగా జట్టుకు విజయాలను అందిస్తున్నా.. వ్యక్తిగతంగా స్కై ఫామ్ మాత్రం బాగాలేదు. గత 17 ఇన్నింగ్స్లలో సూర్య.. 26.81 సగటుతో 429 రన్స్ మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో పరుగుల వరద పారే రాజ్కోట్లో అయినా గత ఫామ్ను సూర్య అందుకోవాలని భారత్ యాజమాన్యం ఆశిస్తోంది. ఇక, సౌతాఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో రెచ్చిపోయిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్తో రెండు మ్యాచ్లలోనూ షార్ట్ బాల్స్కు పెవిలియన్ బాట పట్టాడు. రాజ్కోట్లో అతడు విజృంభిస్తే భారత్కు మంచి శుభారంభం దక్కుతుంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మంచి టచ్లో ఉండగా.. రింకూ సింగ్, నితీశ్ కుమార్ గాయాలతో మ్యాచ్ లకు దూరం కాగా, ఈ మూడో టీ20లో శివమ్ దూబే, రమణ్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
సూర్య ఫామ్ పై నో టెన్షన్
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సూర్య అద్భుతమైన ఆటగాడు. అతడు మంచిగా ఆడిన గేమ్లు చాలా ఉన్నాయి. నాణ్యమైన ప్రదర్శన ఇవ్వలేని మ్యాచ్లనూ చూశాం. కానీ, అతడి ఫామ్పై ఎప్పుడూ మాకు ఆందోళన లేదు. ప్రతిసారి ఒకేలా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. అతడిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులు బౌలింగ్లో మార్పులు చేస్తుంటారు’ అని తెలిపారు.
ఇంగ్లండ్ జట్టు ఇదే
ఇంగ్లండ్.. టీమ్ ఇండియా మధ్య జరగనున్న మూడో టీ20 కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. రెండో టీ20లో ఆడిన జట్టునే కొనసాగిస్తుండగా ఇందులో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ ఆటగాళ్లు ఉన్నారు.