IPL Season 18 : ఐపీఎల్ 18 సీజన్ విజేత బెంగళూరు.. హైలైట్స్ ఇవే

Update: 2025-06-04 08:00 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అవతరించింది. 2025 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల స్వల్ప తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 18 ఎళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురుచూసిన ఆర్సీబీ కల ఇప్పుడు నెరవేరింది. యువ కెప్టెన్ రజత్ పటీదార్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించాడు. మరోవైపు పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. తొలిసారి విజేతగా నిలిచే మంచి అవకాశాన్ని పంజాబ్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఈ టోర్నీ అసాంతం అద్భుంగా పోరాడింది. ఫైనల్లోనూ రాణించినా విజయానికి కేవలం 7 పరుగుల దూరంలో నిలిచి పోయింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (43; 35 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. శశాంక్ సింగ్ (61 నాటౌట్; 30 బంతు ల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జోష్ ఇంగ్లిష్ (39; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు) రాణించాడు. కానీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కీలక మ్యాచ్ లో పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ (1) నిరాశ పరిచాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్య (4-0-17-2), భువనేశ్వర్ కుమార్ (4-0-38-2), యష్ దయాల్ (3-0-18-1) పంజాబ్ బ్యాటర్లను హడలెత్తించారు. కృనాల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Tags:    

Similar News