TEST: యువ భారత్కు అగ్ని పరీక్ష
నేటి నుంచి ఇంగ్లాండ్తో తొలి టెస్ట్.. గిల్పై కెప్టెన్గా తొలి టెస్ట్ గెలవాలనే ఒత్తిడి;
యువ భారత్ అసలైన సవాల్కు సిద్ధమైంది. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి దిగ్గజాలు లేకుండా... ఇంగ్లాండ్తో టీమిండియా అమీతుమీకి సిద్ధమైంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ఈ సిరీస్తోనే ఆరంభం కానుంది. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్య సామర్థ్యానికి... హెడ్ కోచ్ గౌతం గంభీర్ వ్యూహ రచనకు.. సుదీర్ఘ ఫార్మట్లో యువ ఆటగాళ్ల సత్తాకు.. ఈ సిరీస్ సవాల్ కానుంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న గిల్... ఈ టెస్టులో ఎలాంటి ప్రభావం చూపుతాడో... ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అన్న ఉత్కంఠ సగటు క్రికెట్ అభిమానిలో ఉత్కంఠ రేపుతోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి లీడ్స్లోని హెడింగ్లీలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్తో గిల్ తన టెస్ట్ కెప్టెన్సీని మొదలుపెట్టనున్నాడు. కెప్టెన్గా తొలి టెస్ట్ గెలవాలనే ఒత్తిడి అతనిపై ఉంది. ఈ టెస్టు సిరీస్ గిల్కు అగ్ని పరీక్షగా మారనుందని మాజీలు అంచనా వేస్తున్నారు. ఇక తొలి టెస్టు కోసం ఇరు జట్లు ప్లేయింగ్ 11 ప్రకటించాయి. ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం అంత తేలిక కాదు. అయిదు రోజులు జరిగి టెస్టు మ్యాచులో రోజు రోజుకు పరిస్థితులు మారుతుంటాయి. డ్యూక్ బాల్స్ సవాల్ విసురుతాయి. బజ్బాల్ ఆటతో బెంబేలెత్తించే ఇంగ్లాండ్ను సొంతగడ్డపై నిలువరించడం కూడా అంత తేలిక కాదు. వీటికితోడు కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్లు లేకపోవడం కూడా లోటే. ఇన్ని ప్రతికూలంశాల మధ్య గిల్ టీమిండియాను ఎలా నడిపిస్తాడో చూడాలి. కోహ్లీ, రోహిత్ అందించిన వారసత్వాన్ని కొనసాగించడం గిల్కు కత్తి మీద సామే. ముఖ్యంగా విదేశాల్లో కోహ్లీ, రోహిత్ హయాంలో టెస్టుల్లో టీమిండియా విజయాలు అందుకుంది.
గిల్ సమాధానమిస్తాడా...?
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ కావడంతో ఒకరకంగా టెస్టుల్లో గిల్ శకం మొదలైనట్టే. గిల్ను కెప్టెన్గా ప్రకటించాక ఎన్నో విమర్శలు.. ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ‘విదేశాల్లో పెద్దగా ఆకట్టుకోని గిల్కు సారథ్యం ఇవ్వడమేంటి?.. అతనికి అనుభవం తక్కువ.. సీనియర్లను కెప్టెన్గా చేయాల్సింది’అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటికి ఇంగ్లాండ్ టూరులో గిల్ సమాధానం ఇవ్వాల్సి ఉంది. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత బుమ్రానే కెప్టెన్ అవుతాడని చాలా మంది భావించారు. కెప్టెన్సీని తానే తిరస్కరించినట్టు బుమ్రానే చెప్పాడు. జడేజా, రాహుల్, పంత్ ఉన్నారు. కానీ, సెలెక్టర్లు మాత్రం గిల్ వైపు మొగ్గు చూపారు. బీసీసీఐ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని గిల్ ఎంత మేరకు నిరూపించుకుంటాడో చూడాలి. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ అతనికి తొలి పరీక్ష. టెస్టుల్లో భారత్ను నడిపించడం గిల్కు ఇదే తొలిసారి. అయితే, టీ20 ఫార్మాట్లో గిల్కు కెప్టెన్సీ అనుభవం ఉంది. రోహిత్ గైర్హాజరీలో ఐదు టీ20లకు నాయకత్వం వహించాడు. అందులో నాలుగు మ్యాచ్ల్లో భారత్ను గెలిపించాడు. అలాగే, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు గిల్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ సీజన్లో గుజరాత్ను ప్లే ఆఫ్స్కు చేర్చాడు. ఇంగ్లాండ్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, జట్టును నడిపించడం గిల్కు అంత సులభంగా ఉండకపోవచ్చు. దూకుడుతో భారత్ను నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు గిల్పై ఉంది. కాబట్టి, సాధారణంగానే గిల్పై ఒత్తిడి ఉంటుంది. దానికితోడు కోహ్లీ, రోహిత్, అశ్విన్ వంటి సీనియర్లు లేకపోవడం ఎవరూ పూడ్చలేని లోటు. ఈ దిగ్గజ త్రయం లేకుండా భారత జట్టుకు ఇదే తొలి విదేశీ పర్యటన.