Mumbai Test: మూడో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా
రసవత్తరంగా సాగుతున్న మూడో టెస్టు... రాణించిన భారత బౌలర్లు;
వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 171/9 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ బ్యాట్సమన్ విల్ యంగ్ 51 పరుగులతో రాణించగా, భారత్ బౌలర్లలో జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఆకాశ్దీప్, వాషింగ్టన్లకు చెరో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో 86/4 స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్ (90; 146 బంతుల్లో), రిషభ్ పంత్ (60; 59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. వాషింగ్టన్ సుందర్ (38*) రాణించాడు. ఈ క్రమంలోనే భారత్ 28 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన న్యూజిలాండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. విల్ యంగ్ (51;100 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరవగా.. మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు. మ్యాట్ హెన్రీ (10) తొమ్మిదో వికెట్గా వెనుదిరగ్గా.. అజాజ్ పటేల్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్ 3, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
రాణించిన బౌలర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఆకాశ్ దీప్ నాలుగో ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ కాన్వేను (4) పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత టామ్ లేథమ్ (28)తో కలిసి విల్ యంగ్ (71) స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ ఔట్ అయ్యాక డేరిల్ మిచెల్ (82) బాధ్యతాయుతంగా ఆడాడు. దీంతో ఓ దశలో 159/3 పరుగులతో న్యూజిలాండ్ నిలిచింది. కానీ ఓ పక్క మిచెల్ నిలబడ్డా.. అతడికి మిగతా బ్యాటర్లు సహకరించలేదు. భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు.
ఛేజింగ్ కష్టమేనా
వాంఖడేలో అత్యధిక ఛేజింగ్ 163 పరుగులు మాత్రమే. ఆ రికార్డు కూడా దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2000లో భారత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 63 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలాగే 1980లో భారత్ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఇక, ఇదే వేదికలో 1984లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 48 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో ఛేదించింది. ఏదేమైనా న్యూజిలాండ్ను 180 పరుగుల లోపు ఆలౌట్ చేసి.. టీమిండియా బ్యాటర్లు నెమ్మదిగా వికెట్లు కాపాడుకుంటూ ఆడితేనే విజయం సాధ్యమవుతుంది.
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. ఈ టెస్టులో జడేజా 9 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ప్రస్తుత డబ్ల్యూటీసీలో జడేజా 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అశ్విన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించారు. మూడో టెస్టులో టీమిండియాకు స్వల్ప ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌట్ అయింది.