అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 18వ ఎడిషన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. 2025 సీజన్ విజేతగా నిలిచిన జట్టుకు ఏకంగా రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. అలాగే రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ. 12.5 కోట్లు అందనున్నాయి. ప్లేఆఫ్స్ ఓడిన ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ కు కూడా భారీ మొత్తం అందుతుంది. ఎలిమినేటర్లో ఓడిన గుజరాత్ కు రూ.6.5 కోట్లు.. క్వాలిఫయర్-2లో ఓడిన ముంబైకు రూ. 7 కోట్లు దక్కనున్నాయి.
వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శనలు చేసినా వారికి కూడా నగదు బహుమతులు అందుతాయి. కాగా, గత మూడేళ్లుగా (2022-2024) ఇంతే మొత్తాన్ని అందిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అదే ప్రైజ్ మనీని కొనసాగించనున్నారు. అయితే తొలి సీజన్లతో పోలిస్తే ఇప్పుడు ఐపీఎల్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. 2008లో జరిగిన తొలి ఎడిషన్ లో చాంపియన్ గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ కు రూ.4.8 కోట్లు ప్రైజ్ మనీ ఇచ్చారు. అప్పటి రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ కు రూ.2.4 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. ప్రతి ఏడాది ఈ ప్రైజ్ మనీ పెరుగుతూ వస్తోంది.