దులీప్ ట్రోఫీలో సెంచరీతో సత్తా చాటిన ఇషాన్ కిషన్ ను మళ్లీ టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. గతంలో దేశవాళీలో ఆడేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇషాన్ను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. కేవలం గత ఐపీఎల్లోనే ఆడిన ఇషాన్.. కాస్త వెనక్కితగ్గి బుచ్చిబాబు టోర్నీలో పాల్గొన్నాడు. మెరుగైన ప్రదర్శన చేశాడు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా రావడంతో దులీప్ ట్రోఫిలో ఆడేందుకు అవకాశం దక్కింది. ఇండియా ‘సి’ తరఫున ఆడిన ఇషాన్ కిషన్ 126 బాల్స్ లో 111 రన్స్ చేశాడు. దీంతో అతడిని టీమిండియాలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇషాన్.. ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘అన్ఫినిష్డ్ బిజినెస్’ అంటూ దులీప్ ట్రోఫీలో తన ఫొటోలను ఇషాన్ కిషన్ షేర్ చేశాడు. అంటే, తన పని ఇంకా పూర్తి కాలేదని.. నేషనల్ టీమ్ లోకి రావడమే తన టార్గెట్ అని ఇన్ డైరెక్ట్ గా ఇషాన్ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన అనంతరం మూడు టీ20ల సిరీస్లో భారత్ తలపడనుంది. టెస్టు సిరీస్లో ఆడే గిల్, రిషబ్ పంత్కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. దీంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా ఉన్న ఇషాన్ కిషన్ను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని సమాచారం.