మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో ఒక్కరు మినహా మిగిలిన ప్లేయర్లంతా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్నటి వరకు ఆల్రౌండర్ అశ్విన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో ఉండేవారు. అయితే, ఇవాళ అశ్విన్ వీడ్కోలు పలకడంతో కేవలం కోహ్లీ ఒక్కడే మిగిలారు. ఈక్రమంలో అప్పటి వరల్డ్ కప్ ఫొటోలో కోహ్లీని హైలైట్ చేసిన ఫొటో వైరలవుతోంది.
రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ తన చివరి మ్యాచ్ వరకు భారత జట్టుకు అండగా ఉన్నారు. బాల్తోనే కాకుండా అవసరమైనప్పుడు బ్యాట్తోనూ రాణించి నిజమైన ఆల్రౌండర్గా గుర్తింపు పొందారు. బ్యాటర్లు విఫలమైనప్పుడు ‘ఇంకా అశ్విన్ ఉన్నాడులే’ అన్న అభిమానుల ధైర్యం అతడు. మన్కడింగ్, బౌలింగ్ వేస్తూ ఆగిపోవడం వంటి ట్రిక్స్తో ప్రత్యర్థి బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీయడం అశ్విన్కే చెల్లింది.
జట్టు కష్టాల్లో ఉంటే అశ్విన్ ఎంత రిస్క్ అయినా తీసుకొనేవారు. అలసిన తన దేహాన్ని అస్సలు పట్టించుకొనేవారు కాదు. వరుసగా 5 సెషన్లు బౌలింగ్ చేసి నైట్వాచ్మన్గా వచ్చిన సందర్భాలెన్నో. 2021 లో సిడ్నీ టెస్టులో అతడి పట్టుదలను ఎంత పొగిడినా తక్కువే. 49 ఓవర్లు వేసి అతడి కాళ్లు తిమ్మిరెక్కాయి. నడుం నొప్పితో దేహం సహకరించకున్నా ఆఖరి రోజు విహారితో కలిసి క్రీజులో నిలబడ్డారు. ఓడిపోయే మ్యాచును డ్రాగా మలిచారు.