team india: స్మృతి మంధాన శతక గర్జన.. భారత్ విజయం
ఇంగ్లాండ్పై టీమిండియా ఘన విజయం... శతకంతో అదరగొట్టిన స్మృతి మంధాన;
టీమిండియా ఉమెన్స్ టీం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మహిళల ఇంగ్లాండ్ జట్టుపై ఘన విజయం సాధించింది. టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి టీ 20 మ్యాచ్లో భారత మహిళల జట్టు బోణి కొట్టింది. మొదటి మ్యాచ్లోనే ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసి... 97 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. స్మృతి మంధాన (112 ; 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లు) శతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌటైంది.
మంధాన ఊచకోత
తొలి టీ20 మ్యాచ్లో కెప్టెన్ స్మృతి మంధాన అదరగొట్టింది. సెంచరీతో బ్రిటీష్ మహిళా బౌలర్లను ఊచకోత కోసింది. 53 బంతుల్లోనే శతకం సాధించింది. మొత్తం 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసింది. ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన ఈ మ్యాచ్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తలకు గాయం కావడంతో విశ్రాంతి తీసుకుంది. దీంతో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన మంధానా, ముందుండి నడిపించి తన బ్యాటింగ్తో అదరగొట్టింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్గా బరిలోకి దిగిన మంధానా, షఫాలీ వర్మతో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై ఆరంభం నుంచే విరుచుకుపడింది. ఇటీవలే స్మృతి మంధాన ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్వన్గా నిలిచింది. ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ జాబితాలో స్మృతి 727 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2019 తర్వాత స్మృతి మళ్లీ నంబర్వన్ ర్యాంకు సాధించడం ఇదే ప్రథమం. భారత మహిళల T20I క్రికెట్లో హర్మన్ప్రీత్ కౌర్ 49 బంతుల్లో చేసిన సెంచరీ తర్వాత, మంధానా 51 బంతుల్లో సాధించిన శతకం రెండో అత్యంత వేగవంతమైనది. భారత బ్యాటర్లలో మంధాన సెంచరీ చేయగా.. హార్లీన్ డియోల్ (43; 23 బంతుల్లో 7 ఫోర్లు) దూకుడుగా ఆడింది. షెఫాలీ వర్మ (20), రిచా ఘోష్ (12) పరుగులు చేశారు. మంధాన, షెఫాలీ తొలి వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభం నుంచి నిలకడగా బౌండరీలు బాదిన స్మృతి.. ఎకిల్స్టోన్ వేసిన ఏడో ఓవర్లో రెండు సిక్స్లు బాదింది. ఆర్లోట్ బౌలింగ్లో షెఫాలీ వెనుదిరిగింది. చివరి నాలుగు ఓవర్లలో భారత్ 39 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. మంధాన చివరి ఓవర్లో ఔటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, ఆర్లోట్, ఎకిల్స్టోన్ చెరో వికెట్ తీశారు.
కుప్పకూలిన ఇంగ్లాండ్
భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 113 పరుగులకే కుప్పకూలింది. నాట్ సీవర్ (66; 42 బంతుల్లో 10 ఫోర్లు) టాప్ స్కోరర్. బ్యూమాంట్ (10), ఆర్లోట్ (12) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో శ్రీ చరణి (4/12) మెరిసింది. దీప్తి శర్మ 2, రాధా యాదవ్ 2, అమన్జ్యోత్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 జులై 1న బ్రిస్టల్ వేదికగా జరగనుంది.