ఒలింపిక్స్ క్రీడకారులకు అండగా నిలవాలని మ్యాన్కైండ్ ఫార్మా నిర్ణయం
Olympic games: ఒలింపిక్స్లో తృటిలో పతకం చేజార్చుకున్న క్రీడకారులకు అండగా నిలవాలని ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్కైండ్ నిర్ణయించింది.;
Olympic games tokyo 2020: ఒలింపిక్స్లో తృటిలో పతకం చేజార్చుకున్న క్రీడకారులకు అండగా నిలవాలని ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్కైండ్ నిర్ణయించింది. 20 మంది క్రీడాకారులకు 11లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. మెరుగైన ప్రతిభ కనబర్చి...పతకం కోసం తీవ్రంగా శ్రమించిన క్రీడాకారుల్ని, వారి క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని వెల్లడించింది.
మహిళా హాకీ జట్టులోని 16 మందికి, అలాగే బాక్సర్ సతీష్ కుమార్, రెజ్లర్ దీపక్ పునియా, షూటర్ సౌరభ్ చౌదరి, గోల్ఫర్ అదితి అశోక్కు 11 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందిస్తామని మ్యాన్కైండ్ సంస్థ తమ ప్రకటనలో తెలిపింది. వీరంతా పతకం చేజార్చుకున్నా దేశంలోని ప్రతీ ఒక్కరి హృదయాల్ని గెల్చుకున్నారని పేర్కొంది.
ఏ క్రీడలో అయినా...గెలుపు మాత్రమే ప్రామాణికం కాదని మ్యాన్కైండ్ ఫార్మా వైస్ ఛైర్మన్, ఎండీ రాజీవ్ జునేజా అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వారు శ్రమించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో నాయకత్వ స్థాయిలో ఉన్నసంస్థగా క్రీడాకారులు ఏళ్ల తరబడి పడిన శ్రమను గుర్తించాలని భావిస్తున్నట్టు జునేజా తెలిపారు. పతకం కోసం తీవ్రంగా కృషి చేసిన క్రీడాకారులు దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.